Wednesday, March 31, 2010

నమో నమో వెంకటేశా

ఇంట్లో ఒక్కడినే ఉన్నాను. ఏమీ తోచక నా మిత్రులు రవి గోపీలను ఇంటికి రమ్మన్నాను, బాతాఖానీ కొట్టొచ్చని. ఇంటి పోరు తప్పుతుందనో మరే చేతనో అరగంటలో ఇద్దరూ నా ఇంట్లో వాలిపోయారు.

"ఏదన్నా మంచి సినిమా పెట్టరా, కాలక్షేపం అవుతుంది", అన్నాడు రవి.

"సినిమా చూడ్డానికి వీడింటికి రావాలా. చతుర్ముఖ పారాయణం (పేకాట) చేద్దాం" అన్నాడు గోపి. అదే వాడు చేసిన తప్పు.

"మరి నాలుగు ముఖాలు లేవుగా, అందుకని అది cancel" అన్నాను నేను, ఎలాగూ ఓడతానని తెలిసి.
"మరేం చేద్దామో నువ్వే చెప్పు", అన్నాడు గోపి.

"కాసేపు టీవీలో వార్తలు చూద్దాం" అని TV9 ఛానల్ పెట్టాను.

"ఎప్పుడూ TV9 ని తిడుతూ వుంటావు, మరి ఆ ఛానల్ పెట్టావేం?", law point లాగాడు రవి.

"హిరణ్య కశిపుడు హరి ద్వేశి, కానీ ఎప్పుడూ అతని గురించే ఆలోచిస్తుంటాడు, అలాగే ఇది కూడా", అన్నాను నేను.

"వీడెప్పుడూ అంతే, ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటాడు", గొణిగాడు గోపి. ఇంకా ఏదో అనేంతలో చేయి అడ్డం పెట్టి వారించాను, టీవీ volume పెంచుతూ.

స్వప్న వార్తలు చదువుతోంది. " తిరుమలలో కొత్త వివాదం రాజుకుంది. ఈ సారి గొడవ వడగళ, తెంగళ వర్గాల మధ్య నామం ఎలా పెట్టుకోవాలి అన్న విషయంలో. అటు అర్చకులు ఇటు జియ్యంగార్లు.." అని ఇంకా చెప్పబోతుండగా కరెంటు పోఇంది.

"ఈ వడగళ తెంగళ ఏంట్రా, వడగండ్లు, తెగుళ్ళు లాగా" అడిగాడు రవి.

"ఆవి రెండు వర్గాలు, వైష్ణవ మతంలో. అర్చకులు ఎక్కువగా వడగళ వర్గం, జియ్యంగార్లు తెంగళ వర్గం. వడగల వారు నామం 'U' ఆకారంలో పెడ్తారు. తెంగళ వారు ఆ 'U' ఆకారం కింద ఒక గీత కూడ పెడతారు, ముక్కు మీదగా. ఉదాహరణకి, వెంకటేశ్వర స్వామి నామానికి గీత వుంటుంది. అదే, నరసింహ స్వామికి వుండదు".

"అంటే, వెంకటేశ్వరుడు తెంగళ, నరసింహ స్వామి వడగళ, అంతేగా" అన్నాడు రవి. "చూసావా, ఎలా పట్టేసానో" అన్న అర్థం ధ్వనించింది అతని మాటలో.

"వైష్ణవులు వారిలో వారు కొట్టుకుని కల్పించినవే ఈ వడగళ తెంగళ. వాటిని దేవుళ్ళకి కూడ ఆపాదించడం ఏమిట్రా నీ బొంద" అన్నాన్నేను.

"అది సరే, ఇంతకీ ఏ నామం పెట్టుకోవాలి. వడగళ నామమా తెంగళ నామమా?" అడిగాడు గోపి.
"వడగళ నామమే బాగుంటుంది, చూడ్డానికి సింపుల్గా", అన్నాడు రవి.

"కాదు, తెంగళ నామమే కరెక్టు, సాంప్రదాయంగా వుంటుంది", అన్నాడు గోపి.

ఎటూ తేల్చుకోలేక చివరికి నా వైపు తిరిగి "ఇంతకీ ఏ నామం పెట్టుకోవాలి?" అడిగారు ఇద్దరూ.

ఏం చెప్పాలో తెలీలేదు. ఒక్క నిముషం కళ్ళు మూసుకుని విష్ణు మూర్తిని తలచుకున్నాను. వెంటనే సమాధానం స్ఫురించింది. కళ్ళు తెరచి, చిరునవ్వుతో వారిరువురికేసి చూసి
"నాయనలారా, శ్రీ మహా విష్ణువుకి సహస్ర నామాలు. ఆ నామాల్లో ఏ నామమైనా పెట్టుకోవచ్చు, ప్రజలకు నామం పెట్టకుండా." అని తాత్కాలికంగానైనా వివాదానికి తెర దించాను, చానల్ మారుస్తూ.

వాళ్ళడిగిన నామానికి, నేను చెప్పిన నామానికి నామమాత్రంగానైనా లంకె దొరక్క బుర్ర గోక్కుంటూ వుండిపోయారు ఇద్దరూ.

Monday, March 29, 2010

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా

ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ప్రస్తుతానికి అవసరమైనవి కొందామని కొట్టుకు వెళ్ళాను. రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలొ ఇంటి వద్ద ఉన్న ఒకే ఒక సూపర్ మార్కెట్ మూసివేయడం జరిగింది. అందుకని కిరాణా కొట్టుకు వెళ్ళక తప్పలేదు.

కొట్టు పై మెట్టు మీద నుంచుని, సామాన్ల చీటీ షాపు యజమాని శంకర్ సేట్ కి అందించాను. సూపర్ మార్కెట్లో కొనడం అలవాటై, ఈ అనుభవం వింతగా అనిపించింది. తూకం సరిగ్గా చెస్తాడో లేదో,వస్తువుల నాణ్యత ఎలా వుందో, చేతులు శుభ్రంగా కడిగాడో లేదో అని నా మనసు పరి పరి విధాలా అలోచిస్తోంది. నా ప్రశ్నకే సమాధానం అన్నట్టుగా బెల్లం తూకం చెసి, వేళ్ళకి అంటిన బెల్లాన్ని సాంతం నాకేసాడు, షాపులోని కుర్రాడు. అదే చేత్తో కిలో శనగపప్పు తూకం చేసాడు. ఇంకొక ఘన కార్యం చేసాడు. అది type చేయడానికి నా చేతులు రావట్లేదు. ఇంతలో, వాడి cell phone "రింగ రింగ రింగ రింగ రే" అని మ్రోగింది. నా పాపిష్టి కళ్ళతో చూసిన దృశ్యానికి, విన్న ఆ దరిద్రపు పాటకి వెరసి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా కళ్ళు మూసుకుని "రంగ రంగ రంగ రంగ హే" అని ఆ శ్రీ రంగ నాథుని మనసులో తలచుకున్నాను.

"మీ సామాన్లు ready సార్" అన్న సేట్ మాటలతో కళ్ళు తెరిచాను. అన్నీ వున్నాయో లేవో అని చూస్తే పెసరపప్పు కనిపించలేదు నాకు.

"సేట్, షాపులో పెసరపప్పు లేదా?" అని అడిగాను.

"మినపప్పు వుంది సార్", అన్నాడు.

"నేను అడిగింది పెసరపప్పు", సేట్ మాటలు సవరిస్తూ అన్నాను.

"కావాలంటే పుట్నాల పప్పు కూడ వుంది సార్", అన్నాడు.

"అవసరం లేనిది అంటగడతావెందుకు, నాకు కావలసింది పెసరపప్పు. వుందా లేదా చెప్పు" అని అడిగాను కాస్త కటువుగా.

"ఏం సార్. ఇంత చదువుకున్నారు. ఆమెరికా పోయి వచ్చారు. వ్యాపారం చేసే వాళ్ళు 'లేదు' అని అనకూడదు. వ్యాపారం దెబ్బ తింటుందని మా సెంటిమెంట్ సార్. ఈ విషయం తెలీదా మీకు" అని చిలిపిగా నవ్వాడు.

అమెరికా పోయి రావడానికి, ఈ వ్యాపార మర్మం తెలియడానికి సంబంధం ఏమిటో నాకు అంతు చిక్క లేదు. "ఇప్పుడే తెలిసింది, ఈ సారి జాగ్రత్త పడతానులే", అన్నాను ఇబ్బందిగా.

"మొత్తం నాలుగు వందలా ఇరవై రూపాయలు అయ్యింది సార్ బిల్లు" అన్నాడు సేట్.

ఎండలతో బాటు ధరలు కూడ మండిపోతున్నాయి అని గొణుగుతూ 500 నోటు అందించాను సేట్ కి.

"సార్, ఇరవై రూపాయల నోటు వుందా, మీకు వంద ఇస్తాను, అన్నాడు సేట్.

"వంద నోటు వుంది, కావాలా" అని అడిగాను.

"నాకు ఇరవై కావాలి సార్", అన్నాడు సేట్.

"పోనీ, యాభై తీసుకో అన్నాను" నోటు అందిస్తూ.

"సార్, నేను అడిగింది ఇరవై. యాభై వందా ఎందుకిస్తున్నారు?" అని అడిగాడు సేట్

"నీవు నేర్పిన విద్యయే శంకర్ సేటూ" అన్నాను.

"నాకేమీ అర్థం కాలేదు" అన్నట్టు మొహం పెట్టాడు శంకర్ సేట్.

"ఆమెరికా పొయి వచ్చినవాళ్ళు జేబులో చిల్లర లేకపోతే, 'లేదు' అనే పదం ఉచ్చరించరు. అలా అంటే జేబులో ఎప్పటికీ డబ్బులు వుండవని వారి గట్టి నమ్మకం. హైదరాబాదులో పదిహేను సంవత్సరాలుగా రెండు షాపులు నడుపుతున్నావు, ఈ మాత్రం తెలీదా నీకు?" అన్నాను చిరుమందహాసంతో.

ఈ సారి ఇబ్బంది పడడం శంకర్ సేట్ వంతైంది.

గమనిక:


1. "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా" ఒక పద్యంలోని చివరి పాదం అన్న విషయం తెలిస్తే చాల సంతోషం. తెలియక తెలుసుకోగోరితే మరింత సంతోషం. ఆ పద్యం కృష్ణార్జునుల యుద్ద సమయంలో అర్జునుడు కృష్ణునికి అంటించిన చురకలో భాగం (వామనావతారంలో బలి చక్రవర్తిని మూడడుగులు అడిగిన విషయాన్ని గుర్తు చేస్తూ). అక్షర దోషాలుంటే మన్నించి సవరించగలరు.

అదితి కశ్యపులకు గుజ్జువగుచు పుట్టి
అడుగుకొనలేదె మూడడుగులీవు
భిక్షమెత్తుకొనుట కొత్త విద్య కాదయా
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా

2. ఎవరి నమ్మకాలు వారివి. ఆ మాటకొస్తే, ఈ పొస్టింగ్ లోని మొదటి వాక్యం చదవండి. సరుకులు నిండుకున్నాయి అన్నానే గాని లేవు అనలేదు కదా!

Saturday, March 27, 2010

కౌసల్యా సుప్రజా రామా

అదేంటో, తెల్లవారుతున్న కొద్దీ నిద్ర ఎక్కువౌతుంది. నిద్ర లేవడానికి ఇంకా 15 నిముషాలు ఉండగా, "కౌసల్యా సుప్రజా రామా.." అని సుబ్బలక్ష్మి ఎంతో మధురంగా పాడిన పాట వినిపించింది. ఆహా,ఇంత ప్రాచుర్యం పొందిన పాటను పాడిన సుబ్బలక్ష్మి జీవితం ధన్యం కదా అని అనుకుంటుండగా, నా మదిలో ఒక ప్రశ్న మొలకెత్తింది. లక్షలాది మందిని సుప్రభాతంతో నిద్రలేపే సుబ్బలక్ష్మి ఎవరి పాటతో నిద్ర లేచేవారో అని? ఆలోచించడం మొదలెట్టాను. నా శ్రీమతిని అదే అడిగాను.

ఏమండీ!, సుబ్బలక్ష్మి సంగతి అటుంచండి, ఇంకొక పావు గంటలో current పోతుంది, ఆ తరువాత స్నానానికి నీళ్ళు ఉండవు, ఆపై మీ ఇష్టం అన్న మా ఆవిడ మాటలు నా ఆలోచనలకు అడ్డుకట్ట వేశాయి.

Friday, March 26, 2010

మరో మారు మాయా బజారు

ఈ మధ్య నా శ్రీమతి రంగుల మాయా బజార్ చూద్దాం అనింది. ఓకే అన్నాను. సినిమా కూడ ఓకే అనిపించింది. కొన్ని పాటలు, సన్నివేశాలు, పద్యాలు తీసేసారు. ముఖ్యంగా "భలి భలి భలి భలి దేవ" అని సాగే పాట. ఘటోత్కచుని రాక ముందు ఉండే హాస్య సన్నివేశం, ఒకటి రెందు పద్యాలు కూడ కత్తిరించారు. సినిమా చూస్తున్నపుడు ఎంతో advanced technology అప్పటి నుంచే ఉందనిపించింది. నా ఉద్దేష్యం Marcus Bartley పుణ్యమా అని కాదు,మహాభారత కాలం నాటి సంగతి. ఉదాహరణకి

సత్య పీఠం: బహుషా, narco analysis దీని ముందు ఎందుకూ పనికిరాదు.

ప్రియ దర్శిని: (అదే నండి,శశిరేఖ ఇందులో తన బావను చూసుకుని మురిసిపోతుందే,అది): Skype దీని ముందు దిగదుడుపే కదా!

ఆభిమన్యుడు సుభద్ర అడవిలో ప్రయాణం చేస్తుండగా ఘటోత్కచునికి తెలియడం: Highly sensitive sensor mechanism transmitting the signal and activating a device, పరకాయ ప్రవేశము మరియు miniaturization. ఇంకా ఎన్నో అధ్భుతాలు!

నా దృష్టికి వచ్చిన పొరపాటు: లక్ష్మణ కుమారున్ని చూపించినపుడు "సమయానికి తగు మాటలాడెనె" అనే పాటను అనుకరిస్తాడు. అది ఆ సమయానికి తగు పాట కాదేమో అనిపించింది. ఎందుకంటే ఇది త్యాగరాజ స్వామి కృతి కదా!

మొత్తానికి రంగు మారినా,రుచి మరియు చిక్కదనం ఏ మాత్రం మారలేదు నాగి రెడ్డి పుణ్యమా అని.